హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో పలు ఆంక్షలను విధించారు. కేసుల వివరాలను బయటకు వెల్లడించవద్దని వైద్యులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ మాత్రమే కరోనాపై అప్ డేట్స్ ఇవ్వాలని ఆదేశించారు.
ఆసుపత్రి వద్ద మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. ఇకపై ఆసుపత్రి ఆవరణలోకి మీడియాకు అనుమతి లేదు. మీడియా వాహనాలను ఇక్కడి నుంచి తరలించాలని, మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు.మరోవైపు గాంధీ ఆసుపత్రికి నిన్న అర్ధరాత్రి మరో కరోనా అనుమానిత కేసు చేరుకుంది. నిజామాబాద్ జిల్లా రెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆయన గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు.