ఓటీఎస్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై ప్రజలు, ప్రతిపక్షాలు నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాల సమస్యలు సృష్టించే ప్రయత్నంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటీఎస్పై అవగాహన కల్పించాలని.. ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి అవగాహన కలిగించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. రుణాలు మాఫీ చేసి, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేయిస్తున్నామని, పేదలపై దాదాపు 10వేల కోట్ల రూపాయల భారాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు.
ఓటీఎస్ పూర్తి స్వచ్ఛందం అని సీఎం స్పష్టం చేశారు. డిసెంబర్ 21 నుంచే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుందని అన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.
గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలనూ గత ప్రభుత్వం పరిశీలించలేదన్న ఆయన.. సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీకూడా కట్టారని.. ఇవాళ మాట్లాడుతున్నవారు… అప్పుడు ఎందుకు కట్టించున్నారు? అని నిలదీశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్, ఏపీఎస్హెచ్సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఏపీఎస్హెచ్సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇప్పుడు తెలివిలోకి వచ్చాడు.. పవన్ పై విజయసాయి విమర్శలు