ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తయింది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే విశాఖలోని మధురవాడలో 130 ఎకరాలను ఆదాని ఎంటర్ప్రైజెస్కు కేటాయించడానికి కేబినేట్ ఆమోదం తెలిపింది.
అటు శారదా పీఠానికి కూడా మధురవాడలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ-డబ్ల్యూఎస్కు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడానికి, అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసే అంశాన్ని కేబినెట్ ఆమోదించింది. ప్రకాశం జిల్లా వాడ్రేవు సహా 5 ఫిషింగ్ హార్బర్ల్ డీపీఆర్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం త్రైపాక్షిక ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలపగా.. అటు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు వీలుగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి అంగీకారం తెలిపింది.
కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపిన కీలక నిర్ణయాలు ఇవే..
*రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం.
*యూనిట్కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
*ఆంధ్రప్రదేశ్ సినిమా చట్ట సవరణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
*2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం
*అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
*కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
*వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం
*రాష్ట్రంలో 5చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
*పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
*విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేబినెట్
*జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్కు, అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదం
* విశాఖ మధుర వాడలో శ్రీశారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
* అమ్మ ఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసే అంశానికి కేబినెట్ ఆమోదం.