ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. కేవలం ఆదాయ వనరుగా చూడొద్దని, బెల్ట్షాపులను సమూలంగా తొలగించాలన్నారు. అవసరమైతే ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి, బెల్ట్షాపుల వ్యవస్థను నిర్మూలించాలని జగన్ సూచనలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా… 15వ ఆర్థికసంఘం ఎదుట సమర్థంగా ఏపీ వాదన విన్పించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, సమస్యలను వివరిస్తూ నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలని అధికారులకు సూచించారు. సామాన్యుడిపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను జగన్ ఆదేశించారు.