దేశంలోని చాలా సమస్యలకు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా పరిష్కారం చూపారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి కంటే పదునైన ఓటు హక్కు అనే ఆయుధాన్ని అంబేద్కర్ జాతికి అందించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థిక,రాజకీయ, సామాజిక అసమానతలను తొలగించాలని భావించారన్నారు. ప్రధాని మోదీ రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడుస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
సీబీఐ, ఐటీ, ఆర్బీఐ వంటి సంస్థలను నిర్వీర్యం చేసి దేశాన్ని భ్రష్టుపట్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్లను రద్దు చేసి 2 వేల రూపాయల నోట్లు తీసుకురావడం వల్ల ఎవరికి మేలు జరిగిందో ప్రధాని సమాధానం చెప్పాలని నిలదీశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘాన్నీ నీరుగార్చారని విమర్శించారు. 25 లక్షల ఓట్లను తొలగించి సారీ చెప్పి సరిపెట్టే ప్రయత్నం చేస్తే కనీసం ఎన్నికల సంఘం పై చర్యలు కూడా తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.