సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్లను ఉద్దేశించి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు.
ముద్రగడ తీరును ఎండగడుతూ ఆయనకు కౌంటర్గా బహిరంగ లేఖను విడుదల చేశారు.
అవసరమైనప్పుడు మాత్రమే కులం గురించి మాట్లాడతారా? ఇదేనా మీ తండ్రి మీకు చెప్పింది? అంటూ ముద్రగడను సూటిగా ప్రశ్నించారు.
అంబటి రాంబాబు వాడిన బూతులను ముద్రగడ సమర్థిస్తున్నారా? అని నిలదీశారు.
తన లేఖలో బుద్ధా వెంకన్న పలు అంశాలను ప్రస్తావిస్తూ ముద్రగడపై ప్రశ్నల వర్షం కురిపించారు.
“కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ తల్లిని, భార్యను వైసీపీ నేతలు దారుణంగా దూషించినప్పుడు మీకు కులం గుర్తుకు రాలేదా?.
కాపు నేత అయిన నారాయణపై తప్పుడు కేసులు పెట్టి వేధించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని నిలదీశారు.
తనకు అండగా నిలిచింది గవర సామాజికవర్గమని చెప్పే ముద్రగడ, అదే సామాజికవర్గానికి చెందిన తనపై మాచర్లలో హత్యాయత్నం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
1994లో ఎన్నికల్లో ఓడిపోయిన ముద్రగడను, 1999లో చంద్రబాబే పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారని, ఆ రోజు చంద్రబాబును గొప్ప వ్యక్తిగా ప్రశంసించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
అలాంటి చంద్రబాబు అర్ధాంగిని అసెంబ్లీలో అవమానించినప్పుడు, ఆయన ఇంటిపై జోగి రమేశ్ దాడి చేసినప్పుడు జగన్కు ఎందుకు లేఖ రాయలేదని విమర్శించారు.

