ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని, కరోనా సంక్షోభ సమయంలో తమను మరిన్ని కష్టాల్లోకి నెట్టొద్దని ఉద్యోగ సంఘాలు వేడుకుంటున్నాయి.
ఇప్పటికే ఉద్యోగాల తొలగింపుకు సంబంధించి ఈ నెల 1న బీఎస్ఎన్ఎల్ తన హెచ్ఆర్ డైరెక్టర్ అనుమతితో ఒక ఉత్తర్వు జారీ చేసిందని ఆ సంస్థ ఉద్యోగ సంఘం పేర్కొంది. కాంట్రాక్ట్ పనులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగాలు తొలగించాలని యోచిస్తోందని తెలిపింది. ఈ మేరకు అన్ని చీఫ్ జనరల్ మేనేజర్లు చర్యలను తీసుకోవాలని కోరినట్టు పేర్కొంది.