బీజేపీపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే విమర్శలు గుప్పించారు. పాక్ పై జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తరహాలో మహారాష్ట్ర ప్రజలపై మెరుపుదాడి చేశారని అన్నారు. ఇంతకు ముందు బీజేపీ ఈవీఎంలతో ఆట ఆడింది. ఇప్పుడు కొత్త ఆట మొదలు పెట్టింది’ అని ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. ప్రజా తీర్పును అవమానించారని మాపై బీజేపీ ఆరోపణలు చేస్తోందని, కానీ బీజేపీయే ప్రజలను మోసం చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని అన్నారు.
‘శివసేన ఎమ్మెల్యేల్లో కూడా చీలిక తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందా? ప్రయత్నించనివ్వండి. వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడతామని అన్నారు. అప్పట్లో తనను వెన్నుపోటు పొడవాలని చూసిన వారితో ఛత్రపతి శివాజీ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసని తెలిపారు. ప్రజలే బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు.