telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో … టాప్‌ టెన్‌లో రోహిత్‌ శర్మ..

rohit double century in 3rd test

తాజాగా విడుదల చేసిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా హిట్‌ మన్‌ రోహిత్‌ శర్మ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. మూడో టెస్ట్‌కు ముందు 22వ స్థానంలో ఉన్న రోహిత్‌.. రాంచీ టెస్టులో డబుల్‌ సెంచరీ చేసి 722 పాయింట్లతో పదో స్థానానికి చేరుకున్నాడు. దీంతో ఐసిసి మూడు ఫార్మాట్లలో టాప్‌-10లో నిలిచిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మూడు ఫార్మాట్లలో టాప్‌-10లో కొనసాగుతుండగా… అంతకుముందు టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మూడు ఫార్మాట్‌లలో టాప్‌ టెన్‌లో కొనసాగాడు. పుణే టెస్టులో డబుల్‌ సెంచరీ మినహా మరో భారీ స్కోర్‌ సాధించని విరాట్‌ కోహ్లి రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు.

ఆగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్‌ స్మిత్‌కు కోహ్లికి పాయింట్ల(11) వ్యత్యాసం పెరిగింది. ఇక రాంచీ టెస్టులో సెంచరీ సాధించిన వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే ఐదో స్థానానికి చేరుకోగా… చటేశ్వర పుజారా నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన జస్ప్రిత్‌ బుమ్రా మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. జడేజా, షమీ 14, 15 స్థానాలలో కొనసాగుతున్నారు. సఫారీ జట్టును వైట్‌వాష్‌ చేయడంతో టెస్టుల్లో టీమిండియా 119 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Related posts