రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ ప్రభుత్వం బడుగు జీవుల ఉసురు పోసుకుంటోందని ఆయన మండిపడ్డారు.
మీడియాతో మాట్లాడిన ఆయన, మూసీ ప్రక్షాళన పేరుతో వందలాది ఇళ్లను నేలమట్టం చేస్తున్నారని, మధుపార్క్ వంటి అపార్ట్మెంట్లలో నివసించే వారి ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా అని నిలదీశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, పేదలకు కొత్తగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా, ఉన్న నీడను లాక్కోవడం దారుణమని ధ్వజమెత్తారు.
ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలు, విద్యార్థుల డైట్ ఛార్జీలకు నిధులు లేవని చెబుతున్న సర్కారు వేల కోట్లు వెచ్చించి గాంధీ పార్కు నిర్మించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
“బడా బాబులు వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకుంటున్న పాలకులు, సామాన్యుడిపై మాత్రం జులుం ప్రదర్శిస్తున్నారు.
కూకట్పల్లి ఎల్లమ్మబండ వద్ద 120 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనా పట్టించుకునే నాథుడే లేడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవేళ గాంధీ పార్కు కట్టాలనుకుంటే, కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన భూముల్లో నిర్మించుకోవాలి కానీ, పేదల ఇళ్లను పడగొట్టి కాదని అన్నారు.


వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు: సీపీఐ నారాయణ