వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగిపోతాయని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని ప్రయత్నిస్తే రాయలసీమ ప్రజలు అక్కడికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది అని అభిప్రాయపడ్డారు. రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని అడిగే హక్కు రాయలసీమ ప్రజలకు ఉందని అన్నారు.
ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఉంది కనుక ఇప్పుడు కూడా క్యాపిటల్ ఇక్కడే ఏర్పాటు చేయాలని వారు కోరడంలో తప్పులేదని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని ప్రభుత్వం చెబుతుండటం బాగుందన్నారు. కానీ, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేస్తామని చెప్పడం బాగోలేదని అంటూ విమర్శలు చేశారు.