ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె’ అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి. తెలంగాణ సాం స్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని అన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని పేర్కొన్నారు.
వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు తెలంగాణ సాహితీవేత్తలు కృషిని కొనసాగించాలని కోరారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు, రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటోందని కేసీఆర్ చెప్పారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి అందుకుంటున్న ప్రముఖ కవి, రచయిత పెన్నా శివరామకృష్ణకు సీఎం అభినందనలు తెలిపారు.