తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. ఉద్యోగుల , ఉపాధ్యాయ బదిలీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317 వ్యతిరేకంగా కరీంనగర్లో చేపట్టిన బండి సంజయ్ జన జాగరణ దీక్ష భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అడ్డుకున్నకార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో పలు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత బండి సంజయ్ను తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించి మానుకొండుర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నల్గొండలో సీఎం కేసీఆర్ సభకు అనుమతించిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని సంజయ్ ప్రశ్నించారు. 317 జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయి వాడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
అధికార గర్వంతో సీఎం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, శాంతియుతంగా తాము చేస్తున్న జాగరణ దీక్షను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఉపాధ్యాయులకు న్యాయం జరిగేవరకు ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా దీక్ష కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. కరోనా నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని, రూల్స్ అధికార పక్షానికి ఉండవా అని బండి ప్రశ్నించారు.
అంతకుముందు ఆఫీస్ తలుపులు పగులగొట్టి లోపలివెళ్లిన పోలీసులు బండి సంజయ్ ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఎంపీ కార్యాలయం మొత్తం పొగతో కమ్ముకుంది. ఆ తరువాత పోలీసులు తాళాలు పగులగొట్టి.. బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో సంజయ్ అక్కడే దీక్షకు దిగారు.