telugu navyamedia
తెలుగు కవిత్వం వార్తలు సామాజిక

సీనియర్ జర్నలిస్ట్ భగీరథ డాక్టరేటుకు అర్హుడు: పరుచూరి గోపాలకృష్ణ

“మీర్జాపురంరాణి కృష్ణవేణి” అరుదైన భగీరథ ప్రయత్నం. శకపురుషుడు , తారకరామం , నాగలాదేవి , మీర్జాపురంరాణి కృష్ణవేణి లాటి పరిశోధనాత్మక గ్రంధాలను రచించిన భగీరథ డాక్టరేటుకు అర్హుడు.

నేను యూనివర్సిటీలో ఉంటే డాక్టరేట్ ఇప్పించేవాడిని అని తెలుగు సినిమా రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.

సీనియర్ జర్నలిస్ట్ రచించిన “మీర్జాపురం రాణి కృష్ణవేణి ” పుస్తక పరిచయ కార్యక్రమం గురువారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా వచ్చిన గోపాల కృష్ణ మాట్లాడుతూ  ఎన్ .టి .రామారావు గారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ అంటే నాకు ఎంతో గౌరవం , అలాంటి కృష్ణవేణమ్మ జీవిత చరిత్రను వెలువరించిన భగీరధను, నిర్మాత అనురాధాదేవిని నేను మనసారా అభినందిస్తున్నా అని చెప్పారు గోపాలకృష్ణ.

దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ  భగీరథ గారు చేయి తిరిగిన రచయిత , రామారావు గారి శత జయంతి సందర్భగా వెలువరించిన శకపురుషుడు , తారకరామం పుస్తకాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.

ఆయన రచిన నాగలాదేవి , మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ రెండు పుస్తకాలు ఆయనలోని గొప్ప పరిశోధకుడిని మనకు పరిచయం చేస్తాయని చెప్పారు.

దర్శకుడు బి . గోపాల్ మాట్లాడుతూ .. భగీరథ నాకు ఇష్టమైన జర్నలిస్ట్ , రచయిత , ఆయన రాసిన పుస్తకాలన్నీ నేను చదివాను , రచయితగా ఆయనది ఎంతో విలక్షణమైన శైలి.

ఈ మీర్జాపురంరాణి కృష్ణవేణి పుస్తకంలో కృష్ణవేణమ్మ జీవితంతో పాటు తెలుగు సినిమా చరి త్రను కూడా మన కళ్ల ముందు నిలబెట్టారని అన్నారు.

భగీరధకు ఇంకా ఎన్నో గౌరవాలు రావాలని తానూ కోరుకుంటున్నానని గోపాల్ చెప్పారు.

రోజారమణి మాట్లాడుతూ .. కృష్ణవేణమ్మ అంటే నాకు ఎంతో అభిమానము , ఆమె మాలాంటి నటీమణులకు ఆదర్శం , ఆమె జీవిత కథను రచించిన భగీరథ గారిని, అనురాధాదేవి గారిని అభినందిస్తున్నా అని చెప్పారు .

గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ మీర్జాపురం రాణి కృష్ణవేణి పుస్తకాన్ని గత నెల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు ఆవిష్కరించారు , ఆరోజున భగీరథ గారంటే చంద్ర బాబు నాయుడు గారికి ఎంత అభిమానమో నేను ప్రత్యక్షంగా చూశాను.

ఈ రోజు ఈ పుస్తకం గురించి ఇంతమంది వెలిబుచ్చిన అభిప్రాయలు చూస్తుంటే కళారత్న భగీరథ ఎంత పరిశోధన చేసి ఈ గ్రంధాన్ని వెలువరించారో అర్థమవుతుంది.

ఈ గ్రంధం తెలుగు సినిమా రంగానికి అపురూమైనది , కృష్ణవేణమ్మ మీద బయోపిక్ తీయవచ్చు , అందుకు ఈ ఒక్క పుస్తకం చాలు అని చెప్పారు .

ప్రొఫెసర్ ఆర్ .దేవన్న మాట్లాడుతూ భగీరథ రచించిన నాగలాదేవి చదివిన తరువాత ఆయన అభిమానినయ్యా , బళ్లారిలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం బి .ఎస్సీ . విద్యార్థులకు పాఠ్యాంశము గా ప్రవేశపెట్టాం , ఈ మీర్జాపురం రాణి పుస్తకంలో ముందుమాట వ్రాసే అవకాశం ఇచ్చిన భగీరథ గారికి కృతజ్ఞతలు అని చెప్పారు.

పుస్తక రచయిత భగీరథ మాట్లాడుతూ .. మీర్జాపురంరాణి కృష్ణవేణి పుస్తకాన్ని రాయడానికి ప్రధాన కారకురాలు శ్రీమతి అనురాధాదేవి , ఆమె సహకారం లేకపోతే ఈ గ్రంధం వెలువడేదే కాదు , కృష్ణవేణమ్మది విలక్షణమైన జీవితం , సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యురాలుగా ఎదిగి ఒదిగిన మహానటి , ఆమె జీవితం ఈ తరం వారందరికీ స్ఫూర్తి దాయకం అని చెప్పారు.

ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారికి తానెప్పుడూ రుణపడి ఉంటానని భగీరథ చెప్పారు. ఈ సందర్భంగా రచయిత భగీరథను జర్నలిస్ట్ మిత్రులంతా ఆత్మీయంగా సత్కరించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాగంటి మురళి మోహన్ , కె .ఎస్ .రామారావు , కైకాల నాగేశ్వర రావు , కె .అశోకుమార్ , రాశీ మూవీస్ నరసింహా రావు , డి .వి .కె రాజు , అట్లూరి నాగేశ్వర రావు ,

శ్రీమతి అక్కినేని నాగ సుశీల, కాజా సూర్యనారాయణ , తుమ్మల రంగా రావు , సారిపల్లి కొండల రావు , శ్రీమతి విజయలక్ష్మి పండిట్ , బిక్కి కృష్ణ, శ్రీమతి రామ లక్ష్మి, ఓం ప్రకాష్ నారాయణ్ , పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts