బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇందుకోసం 289 రకాల చీరలు సిద్ధం చేసింది. అక్టోబర్ నెల 6 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుండగా, అంతకు నాలుగు రోజుల ముందు నుంచే సందడి ప్రారంభం కానుంది.. ఎందుకంటే.. ఈ ఏడాది కూడా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం పంపిణీ చేసే బతుకమ్మ చీరలను అక్టోబరు 2 నుంచి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే, సిరిసిల్ల చేనేత కళాకారులు తయారుచేసిన బతుకమ్మ చీరలు అన్ని జిల్లాలకు చేరాయి.. పంపిణీ కోసం ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు అధికారులు.. మరోవైపు.. హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం బతుకమ్మ చీరల పంపిణీపై సందేహాలు నెలకొన్నాయి. ఇక, ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉంది.. దీంతో.. కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో చీరల పంపిణీ ఎలా అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఈసీని సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది బతుకమ్మ చీరాల కోసం రూ.318 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.. 17 రంగులు, 15 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలలో బతుకమ్మ చీరలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రేషన్ కార్డులతో వచ్చే లబ్ధిదారులకు ఈ చీరలను పంపినీ చేయనున్నారు.