తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న విషయం విధితమే. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ఇచ్చే చీరలను శనివారం మహిళలు తిరస్కరించారు. మాకు గతేడాది చీరలు ఇవ్వలేదనీ, ఈ ఏడాదీ మాకు చీరలివ్వవద్దంటూ పట్టుబట్టారు. ఇవ్వదల్చుకుంటే గతేడాది, ఈ ఏడాదికి కలిపి రెండు చీరలు ఇవ్వాలని లేకపోతే వద్దని ఆ మహిళలు డిమాండ్ చేశారు.
జిల్లాలోని పుల్కల్ మండలం గొంగుళూర్, చౌటకూర్ గ్రామాల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో అధికారులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. గతేడాది ఎన్నికల కారణంగా చీరలు ఇవ్వలేకపోయామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మహిళలు రెండు చీరలు కావాలని డిమాండ్ చేయడం కొసమెరుపు.