ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై ఆయన్ను విజయవాడకు తరలించారు. రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన ఈఎస్ఐ కుంభకోణంలో భాగంగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.2014 నుంచి 2019 వరకూ ఏపీ కార్మిక మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలను నిర్వహించిన సమయంలో ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో ప్రస్తుత కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం నేతృత్వంలోని విచారణ కమిటీ నివేదికలను సమర్పించగా, కాలం తీరిన మందులు కొన్నారని తేలింది. ఇదే సమయంలో అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని, దాదాపు రూ. 900 కోట్ల అక్రమాలు జరిగి వుంటాయని అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 200 మంది ఏసీబీ అధికారులు 100 మంది పోలీసుల సాయంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధిలోని నిమ్మాడకు చేరుకుని ఆయన ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఆపై ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నాట్టు తెలిపారు.