అఖండ సినిమా విజయం మంచి ప్రేరణ ఇచ్చిందని, అవకాశం వచ్చి మంచికథ ఉంటే మల్టీస్టారర్ సినిమా తీసేందుకు సుముఖంగా ఉన్నానని హీరో బాలకృష్ణ అన్నారు. కరోనా కష్టకాలంలో తెలుగుసినిమా పరిశ్రమకు ఆఖండ సినిమా విజయం ఊపిరి పోసిందని తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో అఖండ సినిమాను ఆదరించిన ప్రేక్షకులతో రికార్డుస్థాయి కలెక్షన్లు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
అమ్మవారి ఆశీసులకోసం విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నామన్నారు. సినిమా దర్శకులు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలసి ఆయన కనకదుర్గను దర్శించుకున్నారు. తెలుగుసినిమా రంగంలో నందమూరి తారకరామారావు పౌరాణిక, ఆధ్యాత్మిక నేపథ్యంతో సినిమాలు తీసి భక్తిభావాన్ని పెంపొందించారనీ, ఈ రోజుల్లో అఖండ సినిమా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రజల్లో మంచి అవగాహన పెంపొందించిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
గ్రామాలు, పట్టణాల్లో కుటుంబ సమేతంగా థియేటర్లకొచ్చి సినిమా చూసేందుకు ఆసక్తికనబరచడం ఆనందంగా ఉందన్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే విశ్వాసం రెట్టింపయిందన్నారు. టిక్కెట్ల ధరలు తగ్గింపును పట్టించుకోకుండా… ప్రభుత్వ నిబంధనలతో విడుదలచేసిన అఖండ అపూర్వ విజయాన్ని సొంతంచేసుకుని, సినీ పరిశ్రమలో ఉత్తేజం నింపిందన్నారు.
సినిమా మంచి సినిమాగా తెరకెక్కిందని ధైర్యంగా ముందడుగువేశామన్నారు. ధైర్యంతో వేసిన తొలి అడుగే విజయానికి సంకేతమన్నారు. అఖండను విజయపథంలో నడిపించిన ప్రేక్షకులకు హీరో బాలకృష్ణ, దర్శకులు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
“బిగ్ బాస్-4″కు వెళ్లేముందు గంగవ్వ చెప్పిన మాటలు…!