దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు మాత్రమే మనల్ని రక్షించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలు బీజేపీలో కూడా అంతర్గతంగా దుమరాన్ని లేపాయి. కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.
వైరస్ కు స్థాయి, అంతస్తు అనే తేడా లేదని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజుల వ్యవధిలోనే డబుల్ అవుతాయని తెలిపారు. కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని కాపాడగలడని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటకలోని సొంత బీజేపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.