మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్లకు దొంగపట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని బాపులపాడు తహశీల్దార్ నరసింహారావు ఆరోపించారు. ఈ మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో వల్లభనేని పై కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా వంశీ తన అనుచరులతో కలిసి బాపులపాడు మండలంలోని పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, బాపులపాడు సహా పలు గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలను వేల సంఖ్యలో పంపిణీ చేసినట్టు ఆరోపణలు ఉండడంతో కేసు నమోదైనట్టు తెలుస్తోంది.