ఈఎస్ఐ స్కాం కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న ఆయనను ఏసీబీ పోలీసులు శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. సుదీర్ఘ ప్రయాణం కారణంగా ఆయన ఆపరేషన్ గాయం తిరగబెట్టింది. పుండు నుంచి రక్తస్రావం అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన గాయం తగ్గడానికి రెండు వారాలకు పైనే పట్టవచ్చని చెపుతున్నారు.
అచ్చెన్న ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అచ్చెన్నకు బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టులో ఆయన తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు పిటిషన్ వేశారు. ఆన్ లైన్లో పిటిషన్ దాఖలైంది. దీనికితోడు, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వీలుగా అనుమతిని ఇవ్వాలని మరో పిటిషన్ కూడా వేశారు.