తమ డిమాండ్లను పరిష్కరించాలని ఏపీయస్ఆర్టీసీ ఉద్యోగులు యాజమాన్యానికి సమ్మె నోటిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీయస్ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు స్పందించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటిసు గురించి కంగారుపడాల్సిన అవసరం లేదని సురేంద్రబాబు అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుండి సమ్మెకు వెళ్లడానికి 43 రోజుల సమయం ఉందని తెలిపారు.
గత డిసెంబర్లో కూడా పేస్కేల్పై, పెండింగ్ వేతన బకాయిలపై ఇలానే సమ్మె నోటీస్ ఇచ్చారన్నారు. ఫిబ్రవరిలో హామీలపై చర్చలు జరిపామని అనంతరం సమ్మె విరమించారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుండి బడ్జెట్ రాని కారణంగా అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయామని పేర్కొన్నారు. ఆర్టీసి ఏడాదికి రూ. 5995 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. అయితే బ్యాంక్ లోన్స్ రూపంలో రూ. 3,380 కోట్లు అప్పు ఉందని ఆయన వెల్లడించారు.