సాంకేతిక రంగం అభివృద్ది చెందిన నేపథ్యంలో నేటి యువత రాత్రింభవళ్ళు స్మార్ట్ పై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్ లో పబ్ జీ గేమ్ ఓ తెలంగాణ యువకునికి వ్యసనంగా మారింది. తాజాగా పబ్ జీ గేమ్ కు బానిసైన ఓ యువకుడు మెడ నరాలు దెబ్బతినడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో చోటుచేసుకుంది.
రాజారంపల్లి గ్రామానికి చెందిన సాగర్(20) తొలుత పబ్ జీ గేమ్ ను టైంపాస్ గా ఆడటం మొదలుపెట్టాడు. అయితే ఇది కాస్తా వ్యసనంగా మారింది. దీంతో ఆ గీమ్ కు బానిసై 45 రోజులు అదేపనిగా పబ్ జీ ఆడటంతో మెడ నరాలు పట్టేశాయి. దీంతో కుటుంబ సభ్యులు సాగర్ ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ, మెడ నరాలు పూర్తిగా దెబ్బతినడంతో సాగర్ ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.