చార్జీలు పెంచేందుకు ఏపీఎస్ ఆర్టీలో రంగం సిద్ధమైంది. నిర్వహణా వ్యయం, బస్సుల మరమ్మతు వ్యయాలతో పాటు ఉద్యోగుల వేతనాల మొత్తం పెరగడంతో, నష్టాన్ని నివారించేందుకు బస్సు చార్జీలను పెంచాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 15 నుంచి 17 శాతం వరకూ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని కోరుతూ తయారు చేసిన ప్రతిపాదనలను ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు ప్రభుత్వానికి పంపారు.
ఈ ప్రతిపాదనల ప్రకారం, ఏసీ సర్వీసుల్లో 17 శాతం వరకూ, నాన్ ఏసీ సర్వీసుల్లో 15 శాతం వరకూ టికెట్ ధరలను పెంచేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. అయితే, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి లేకపోవడంతో ఫలితాలు వచ్చిన తరువాత ధరల పెంపుపై నిర్ణయం వెలువడ వచ్చని ఆర్టీసీ ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ప్రస్తుతం రూ. 1000గా ఉన్న చార్జీ రూ. 1,170 వరకూ పెరుగుతుంది.