డేటా చోరీ అంశంపై అసత్య ప్రచారం జరుగుతోందని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ప్రజలను తికమక పెట్టి రాజకీయపబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధార్ డేటా చోరీకి గురికాలేదని వెల్లడించారు. డేటా చోరీ విషయమై పోలీసులు లేనిపోనీ ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ వాళ్ల ఓట్లను తాము లేకుండా చేయాలని ఆ పార్టీ వాళ్లు చేస్తున్న ఆరోపణలు ‘దొంగే దొంగను పట్టుకోండి’ అన్నట్టుగా ఉన్నాయని కోడెల వ్యాఖ్యానించారు.
ఓట్ల తొలగింపు లాంటి అసత్య ప్రచారం చేయమని వైఎస్ జగన్ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయాల నుంచి తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని కోడెల స్పష్టం చేశారు. టీడీపీ తనకు రాజకీయ జీవితం ఇచ్చిందని ఆ పార్టీ కోసం తాను పనిచేస్తానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయం కోసం కష్టపడి పని చేస్తానని చెప్పారు. కేవలం తన గెలుపు కోసమే కాకుండా అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తామని కోడెల అన్నారు.


తన కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ఆందోళన: కోడెల