లక్షలాది మంది ఖాతాదారులకు సేవలందించిన ఆంధ్రా బ్యాంకు నేటి నుంచి యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాగా మారబోతుంది. ఎందుకంటే ఆంధ్రాబ్యాంకు యుబిఐలో విలీనమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంకును కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు ప్రధాన కేంద్రంగా స్థాపించారు. .తెలుగు వాళ్లకు బ్యాంకింగ్లో ఎంతో సేవలందించి..తన అనుబంధాన్ని పెంచుకున్న ఏకైక జాతీయ బ్యాంకు ఆంధ్రాబ్యాంక్ కావడం విశేషం.
1923 నవంబర్లో ప్రారంభమైన ఈ బ్యాంకు..భారతీయ బ్యాంకింగ్ రంగానికి సాంకేతికతను పరిచయం చేసింది. 1980లో ఈ బ్యాంకును జాతీయం చేశారు. జాతీయం చేసే నాటికి ఆంధ్రాబ్యాంకు 974 పూర్తిస్థాయి శాఖలు, 40 క్లస్టర్ బ్రాంచ్లు, 76 ఎక్స్టెన్షన్ కౌంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,904 శాఖలు ఉండగా, 21,740 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక దేశంలోనే తొలిసారి క్రెడిట్ కార్డులను జారీచేసిన చరిత్ర కూడా ఆంధ్రాబ్యాంకుదే. ఎన్నో రికార్డులను సృష్టించిన ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు కనుమరుగు కాబోతోంది.