ప్రస్తుత పరిస్థితుల్లో రోజు రోజుకూ పని పెరుగుతుండటంతో ఇంటిల్లిపాది బయటకు వెళ్లి ఎంజాయ్ చేయడం బాగా తగ్గిపోతోంది. అందుకే చాలా మంది టికెట్ కొనుక్కుని సినిమా చూసే అలవాటును మార్చుకుంటున్నారు. దీనికి కారణం మార్కెట్లో బోలెడు ఓవర్ ద టాప్ (ఓటీటీ) ఫ్లాట్ఫామ్స్ ఉండడమే. సంవత్సరానికి రూ. 1000 పెట్టి లాగిన్ అయితే.. రిలీజ్ అయిన నెలకో, యాభై రోజులకో ఇంటిల్లిపాది కూర్చుని ఆ సినిమాలను చూసేయొచ్చు. దీంతో డబ్బులు, సమయం రెండూ సేవ్ అవుతాయి. అదే సమయంలో అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఇప్పటికే ఎన్నో సంస్థలు స్ట్రీమింగ్ను మొదలెట్టేశాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, జీ5 అత్యంత ప్రజాదరణ పొందాయి. వీటిని భారతదేశంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అందుకే ఈ సైట్లు టాప్లో ఉంటున్నాయి.
ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో ప్రసారం అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్లకు సెన్సార్ ఉండదు. దీంతో మామూలు వాటితో పోల్చుకుంటే అక్కడ ప్రసారం అయ్యేవి పచ్చిగా ఉంటాయి. రొమాంటిక్ సీన్లు, బూతు డైలాగులు, రక్తపాతం ఉన్న సన్నివేశాలు మొదలైనవి వీటిలో యధాతధంగా చూపించేస్తారు. అది కూడా వీటి డిమాండ్ పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ శకం నడుస్తున్న కారణంగా చాలా మంది వాటి వైపు మళ్ళుతున్నారు. బిజినెస్ పరంగా కొందరు ఫిల్మ్ మేకర్లు వాటికి ఆకర్షితులు అవుతుంటే.. డిమాండ్ ఆధారంగా చాలా మంది హీరోయిన్లు, నటులు కూడా వీటిపై ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది వెబ్ సిరీస్లలో నటించడానికి ముందుకు వస్తున్నారు. అందరూ వెళ్లే దారిలో నడవాలని అనుకున్నారో.. లేక మనకంటూ ఓ ఫ్లాట్ఫామ్ ఉండాలని డిసైడ్ అయ్యారో తెలియదు కానీ, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ త్వరలోనే సరికొత్త ఓటీటీ ఫ్లాట్ఫామ్ను తెలుగు వారికి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలో తీసుకొస్తున్న ఫ్లాట్ఫామ్ కోసం అల్లు అరవింద్ అప్పుడే ఓ సినిమాను కూడా కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. అదే.. యంగ్ హీరో నిఖిల్ – లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో వచ్చిన ‘అర్జున్ సురవరం’ అని సమాచారం. ఈ సినిమా మంచి టాక్తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతోంది. దీంతో ఈ సినిమాను ఆయన రూ. 2.50 కోట్లకు తీసుకున్నారని టాలీవుడ్ టాక్!