హాస్య కథానాయకుడిగా రాజేంద్ర ప్రసాద్ తరువాత తెలుగు తెరపై సందడి చేసిన ఘనత ‘అల్లరి’ నరేశ్ దే. చాలావేగంగా ఆయన 50 సినిమాలను పూర్తి చేశాడు. అలాంటి ‘అల్లరి’ నరేశ్ కి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దాంతో హీరోగా ఆయన సరైన కథకోసం వెయిట్ చేస్తూనే, కీలకమైన పాత్రలను సైతం చేయడానికి రంగంలోకి దిగాడు.
తాజాగా ‘మహర్షి’ సినిమాలో మహేశ్ బాబు స్నేహితుడిగా నటించాడు. ఈ సినిమా తరువాత ఆయన ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఆయన తదుపరి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వుండనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇది మల్టీ స్టారర్ మూవీ అనీ .. ఇందులో మరో హీరో కూడా చేయనున్నాడని చెబుతున్నారు. ఎస్వీఆర్ మీడియా బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు.