*అగ్నిపథ్ స్కీమ్ చెలరేగిన హింస..
*రైళ్లకు, పోలీసుల వాహనాలకు నిప్పు..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ స్కీమ్ పై దేశంలో పలుచోట్ల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రెండో రోజు నిరసనలు తెలిపారు. అయితే ఇవి హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు రోడ్లపై వాహనాలను తగులబెట్టారు. రైళ్లకు నిప్పుపెట్టి విధ్వంసం సృష్టించారు.
ఈ నేపథ్యంలో నిసనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయగా, పోలీసులపైకి రాళ్లురువ్వారు నిరసనకారులు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఆందోళనల వల్ల 22 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. లాఠీలు చేతపట్టిన నిరసనకారులు భభువా రోడ్ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు అద్దాలను పగులగొట్టారు. ఒక కోచ్కు నిప్పు పెట్టారు. ‘‘ఇండియన్ ఆర్మీ ప్రేమికులు’’ అనే బ్యానర్ ను ప్రదర్శిస్తూ అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనల వల్ల ఐదు రైళ్లను నిలిపివేయాల్సి వచ్చిందని తూర్పు మధ్య రైల్వే ప్రకటించింది
డిఫెన్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభమవడం కోసం రెండేళ్ళ నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వీరంతా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అగ్నిపథ్ స్కీమ్ నిబంధనలు :-
కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని మంగళవారం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసుగలవారిని అగ్నివీరులుగా ఎంపిక చేస్తారు. వీరిని నాలుగేళ్ళ తర్వాత విడుదల చేస్తారు. ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఈ నాలుగేళ్ళ కాలంలో నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు వేతనం చెల్లిస్తారు. జీవిత బీమా వంటి సదుపాయాలను కూడా కల్పిస్తారు.
అగ్నివీరులుగా చేరేందుకు మహిళలు కూడా అర్హులే. సైన్యం, నావికా దళం, వాయు సేనలలో దాదాపు 45,000 మందిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రిక్రూట్మెంట్లు 90 రోజుల్లో ప్రారంభమవుతాయని, మొదటి బ్యాచ్ 2023 జూలైనాటికి సిద్ధమవుతుందని తెలిపింది.

