భారతదేశంలో పెళ్లి అంటే వేడుకగా జరుపుకుంటారు. భారీగా బంధువర్గం హాజరవుతుంది. అనేకరకాల సంబరాల మధ్య ఉత్సాహంగా ఉత్సవం జరిగినట్టుగా పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే అంతా మంచి జరిగితే పరవాలేదు.. కానీ అనుకోని ప్రమాదం సంభవిస్తే మాత్రం జరిగే నష్టం కూడా భారీగానే ఉంటుంది. తాజాగా, ఓ పెళ్లి వేడుకలో అదే జరిగింది. పెళ్లి ఊరేగింపులో ఉన్న జనం మీదకు వేగంగా దూసుకువచ్చిన ట్రక్కు రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు పిల్లలతో కలిసి 13 మంది మృతి చెందారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్ఘడ్ జిల్లాలో రాందేవ్ దేవాలయం వద్ద 113వ నంబరు జాతీయ రహదారిపై పెళ్లి ఊరేగింపు సాగుతుండగా వేగంగా ఓ ట్రక్కు దూసుకువచ్చింది.
ఈ ఘటనలో 13 మంది మరణించగా, మరో 18 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చోటి సద్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో దౌల్తారాం (60), భారత్ (30), శుభం (5), చోటు (5), దిలీప్ (11), అర్జున్ (15), ఇషు (19), రమేష్ (30), కరణ్ (28)లున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ట్రక్ డ్రైవరు పెళ్లి ఊరేగింపును సరిగా చూడకుండా వారిపైకి ట్రక్ నడిపాడని డీఎస్పీ విజయపాల్ సింగ్ సంధూ చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.
ఆమెపై కోపం లేదు… కానీ అదే చిరాకేస్తుంది : విజయ్ దేవరకొండ