అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. మూడు వారాల్లోగా సమాధానమివ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈబీసీ 10శాతం రిజర్వేషన్లు ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సమస్య తీవ్రత దృష్ట్యా అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
ఈబీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ వ్యాపారవేత్త తెహసిన్ పూనావాలా ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల కోసం వెనుకబాటుతనాన్ని కేవలం ఆర్థిక ప్రాతిపదికనే పరిగణనలోకి తీసుకోలేమని చెబుతూ ఈ బిల్లును కొట్టివేయాల్సిందిగా పిటిషనర్ న్యాయస్ధానాన్ని కోరారు. జనరల్ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పించడం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన 50 శాతం రిజర్వేషన్లను మించిపోయిందని పిటిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.