తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
శుక్రవారం ఇక్కడి ఓ హోటల్లో నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకర్లు విస్తృతంగా రుణాలు అందించాలని, పశుసంవర్ధక, మత్స్య, కార్మిక ఆధారిత పరిశ్రమల వంటి రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పోషకాహార భద్రతను పెంపొందించేందుకు మినుముల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మినుము ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తుమ్మల సూచించారు.
కార్యక్రమంలో సీనియర్ అధికారులు, నాబార్డు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.