కొత్త పార్లమెంటుకు ముహూర్తం ఫిక్స్ అయింది. పార్లమెంటు కొత్త భవన శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ప్రధాని మంత్రి మోదీ పార్లమెంట్ భవనానికి భూమిపూజ చేయనున్నారు. రూ .861.9 కోట్ల వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల భారీ రాజసౌధం నిర్మించనున్నారు. టాటా సంస్థ పార్లమెంట్ నూతన భవన నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. 21 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం లోక్సభలో 545 మంది, రాజ్యసభలో 245 మంది ఎంపీలు ఉన్నారు. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు ఈ మేరకు ప్రాతినిధ్యం ఏర్టాటు చేశారు. 2026 తర్వాత మళ్లీ డీలిమిటేషన్ చేయనున్నారు. ఈ సారి 2001 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లు కేటాయిస్తారని తెలుస్తుంది. పెరిగిన జనాభా ప్రకారం పార్లమెంట్ సభ్యుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది ఎంపీలు కూర్చునేలా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు.