రాష్ట్రంలో మిడతల దండు ప్రవేశించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మిడతల దండు గమనంపై సమాచారాన్ని తెప్పించుకొన్న సీఎం అధికారులతో చర్చించారు.
గత నెలలో మూడు విడతలుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకు మిడతలు వచ్చాయి. తెలంగాణ వైపు మిడతలు రాలేదు. తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది. రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ దగ్గర అజ్ని అనే గ్రామం దగ్గర ప్రస్తుతం మిడతల దండు ఉంది. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని సీఎం వివరించారు. తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.