వలస కార్మికుల ఇబ్బందులపై నిన్న ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారిని స్వరాష్ట్రాలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాల వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు నేటి నుంచి రోజుకు 40 రైళ్లను నడపనున్నట్టు కేసీఆర్ తెలిపారు. బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామని తెలిపారు.
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలతోపాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లను నడపనున్నట్టు పేర్కొన్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులను ఈ రైళ్ల ద్వారా తరలించనున్నారు. కార్మికులను వారి ప్రాంతాలకు తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్ల గురించి వారికి వివరించాలని పోలీసులకు సూచించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.

