తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన నిర్ణయం తెస్సుకున్నారు. తన వ్యక్తిగత భద్రతను ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా తనకు ఉన్న ప్రత్యేక భద్రతను సైతం వెనక్కు పంపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయనపై ఇటీవల రాళ్ల దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించారు. అయితే, బండి సంజయ్ పై రాళ్ల దాడి జరగలేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వదంతి వ్యాపించిందని, రాళ్ల దాడి ఘటన అబద్ధమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ తన ప్రత్యేక భద్రతను వాపస్ పంపినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఏ ప్రజాప్రతినిధిపైనా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడా రాళ్ల దాడులు జరగలేదని స్పష్టం చేశారు.