విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇంకొంచెం అభివృద్ధి చేస్తే కనుక హైదరాబాద్ ను తలదన్నే సిటీగా విశాఖ ఆవిర్భవిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి చెందిన పది నగరాలను తీసుకుంటే అందులో వైజాగ్ ఒకటి అని అన్నారు.
అమరావతి, విశాఖను పోల్చి చూస్తే కనుక ‘సున్నా’కు ‘వంద’కు ఉన్నంత తేడా ఉందని ఏపీ మంత్రి విమర్శించారు. విశాఖకు బదులు తుళ్లూరులో హైటెక్ సిటీ ఏర్పాటు చేస్తే ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలను అభివృద్ధి చేయడం అవసరమేనని అన్నారు. రాయలసీమ ప్రాంతం కరవుతో ఉంటుందని, అక్కడ నీరు కావాలని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మౌలికసదుపాయాల కల్పన, నిరక్షరాస్యత, నిరుద్యోగ సమస్య ఉందన్నారు.