ప్రస్తుత పోటీ ప్రపంచంలో తెలుగు కంటే ఇంగ్లీషు అవసరమే ఎక్కువ ఉందని సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇంగ్లీషుకే ఇస్తున్నారు. తెలుగు భాషకు అలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకే తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమంవైపే మొగ్గు చూపుతున్నారు. తెలుగు అమ్మ భాషగా మనకు ఉంటుంది. ఇంట్లో మాట్లాడుకోవచ్చు. సంపన్నుల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారన్నారు.
డబ్బులేని దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు విధిలేక మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు. అందుకే వీరిలో చాలామందికి ఉద్యోగాలు రావడం లేదన్నారు. దళితవర్గాల ఎదుగుదలకూ, ఆత్మగౌరవానికీ ఇది అడ్డంకిగా మారుతుందని తెలిపారు. ఉన్నత స్థానాలకు ఎదగాలనే కోరికతోనే దళితులు కూడా ఆంగ్ల మాధ్యమం కోరుకుంటున్నారని తెలిపారు.