ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ప్రగతిభవన్ ను ముట్టడించారు. పరీక్షలపై పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ సర్కారు ఎంట్రన్సు టెస్టుల నిర్వహణకు ప్రయత్నిస్తోందంటూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వారు పీపీఈ కిట్లు ధరించి ప్రగతిభవన్ వద్దకు ఒక్కసారిగా దూసుకువచ్చారు. ఎన్ఎస్ యూఐ పతాకాలను చేబూనిన వారు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ దశలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పలువురు ఎన్ఎస్ యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ యూఐ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా టెస్టులపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు.