ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయవతి స్పందించారు. భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానిస్తే బాగుండేదని ఆమే అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ తనతో పాటు రాష్ట్రపతిని తీసుకుని వెళ్లాల్సిందని ఆమె పేర్కొన్నారు.
ఆదివారం మాయావతి మీడియాతో మాట్లాడారు. ఎలాగూ దళిత సాధువులను భూమిపూజకు ఆహ్వానించలేదని, కనీసం దళిత కమ్యూనిటీకి చెందిన రాష్ట్రపతినైనా ఆహ్వానించి ఉండాల్సిందని మాయావతి అన్నారు. అలా చేసిఉంటే సమాజానికి ఒక మంచి సందేశం వెళ్లి ఉండేదని పేర్కొన్నారు
.రామరాజ్యం గురించి మాట్లాడినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. రాముడి ఆదర్శాలను ఆచరణలో చూపాలి. యోగి ప్రభుత్వ హయాంలో యూపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. రోజురోజుకూ నేరాల శాతం పెరుగుతోందని చెప్పారు. యూపీలో రామరాజ్యం లేదని మాయావతి విమర్శించారు.