మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన-బీజేపీ మధ్య వైరుధ్యం ఏర్పడిన నేపథ్యంలో శివసేన నుంచి ఎంపీగా గెలిచి, కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించిన అరవింద్ సావంత్ ఆ పదవికి రాజీనామా చేయనున్నారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి మోదీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నాని అధికారికంగా ప్రకటించారు. దీంతో ముంబైతో పాటు ఢిల్లీ రాజకీయాలు సైతం ఒక్కసారిగా వేడెక్కాయి. అలాగే రాష్ట్రంలో సోమవారం భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వ ఏర్పాటులో తాము మద్దతు తెలపాలంటే శివసేన ఎన్డీయే కూటమి నుంచి పూర్తిగా బయటకు రావాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ షరతు పెట్టిన విషయం తెలిసిందే.
పవార్ కండీషన్కు స్పందించిన శివసేన.. ఆదివారం అర్థరాత్రి వరకు పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వ్యూహరచన చేసింది. ఎన్సీపీతో శివసేన పలుమార్లు భేటీ అయింది. కానీ, కాంగ్రెస్ నిర్ణయం మేరకు మేం నడుచుకుంటామని వారు తెల్చిచెప్పారు. దీంతో, శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్తో జట్టుకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.