జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు వాహనాలే లక్ష్యంగా దాడులు చేశారు. సోపియాన్ జిల్లా చిత్రగాం వద్ద ఆగి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో కశ్మీరేతరులు ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వాహనాలకు నిప్పుపెట్టడంతో కలకలం రేగింది. వెంటనే పోలీసులు ప్రమాద స్థలంలో కూంబింగ్ చేపట్టారు. జైనపోర పోలీసు స్టేషన్ పరిధిలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. ఇటీవలే ఆపిల్ రైతులు, వ్యాపారులకు భద్రత కల్పిస్తామని పోలీసులు భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉగ్ర మూకలు రెచ్చిపోవడం కలకలం రేగింది. మృతుల్లో ఒకరు జీవన్ సింగ్ అని గుర్తించారు. అతని స్వస్థలం పంజాబ్లోని హోషియాపూర్ అని గుర్తించారు. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.
మరొకరు రాజస్థాన్కు చెందిన మహ్మద్ ఇలియాన్గా గుర్తించారు. అతని స్వస్థలం అల్వార్ అని పోలీసు అధికారులు వివరించారు. గత కొన్నాళ్ల నుంచి యాపిల్ వ్యాపారుల లక్ష్యంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దీంతో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్తబ్ధుగా ఉన్న కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగస్ట్ 5వ తేదీన కశ్మీర్ను జమ్ముకశ్మీర్, లడాఖ్గా విభజించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కశ్మీర్ లోయ గుంభనంగా ఉండిపోయింది. సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా మొహరించారు. కానీ ఆడపాదడపా మాత్రం దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.