తెలంగాణలో ఈ నెల 21న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని కోదండరాం స్పష్టం చేశారు. టీఆర్ఎస్ విధానాలను ఎండగట్టేందుకే తాము ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనసాగిస్తుందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన జరగడంలేదని విమర్శించారు. ప్రభుత్వమే స్వార్థ ప్రయోజనాల కోసం సహజ వనరులను లూటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ మంత్రివర్గం అంతా హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో గెలుపే అజెండాగా రంగంలోకి దిగిందని కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షంలో ఉండీ అధికారులను బెదిరిస్తున్నారు: మంత్రి అనిల్