టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలో అక్రమ కట్టడాన్ని ఖాళీ చేయాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు స్పందించకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. కృష్ణానదికి వరద వస్తే ఉండవల్లిలోని ఇల్లు మునిగిపోతుందన్నారు. అలాంటి ఇంటిని ఖాళీ చేయడానికి చంద్రబాబుకు ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.
చట్టాలు ఉల్లంఘించి కోర్టు నుంచి రెండు సార్లు నోటీసులు వచ్చినా చంద్రబాబు స్పందించలేదని ఆర్కే దుయ్యబట్టారు. చంద్రబాబు కోరుకుంటే ప్రభుత్వం సురక్షితమైన ఇంటిని కేటాయిస్తుందని ఆర్కే చెప్పారు. ఇంకా మునిగిపోయే ఉండవల్లి నివాసంలోనే ఉంటానని చెప్పడం సరికాదన్నారు. ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించాలని ఆర్కే హితవు పలికారు.