ఈరోజు హిందీ దినోత్సవం సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెనుదుమారాన్ని లేపుతున్నాయి. భారత్ ఐక్యంగా ఉండాలంటే హిందీ వల్లే సాధ్యమనీ, కాబట్టి ప్రజలంతా హిందీని ప్రోత్సహించాలని షా పిలుపునిచ్చారు. భారత్ లో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని షా చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు.
భారత్ హిందీ, హిందూ, హిందుత్వ అనే ఆలోచనల కంటే చాలా పెద్దదని ఒవైసీ తెలిపారు. హిందీ భాష ప్రతీ భారతీయుడి మాతృభాష కాదని ఆయన స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 ప్రతీ భారతీయుడికి భాషా, సాంస్కృతిక హక్కును కల్పిస్తోందిని ఒవైసీ ట్విటర్ లో పేర్కొన్నారు.