ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య పుల్వామా దాడి నేపథ్యంలో ఉన్న పరిస్థితి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ‘వెరీ వెరీ బ్యాడ్’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చాలా ప్రమాదకరమైన పరిస్థితి నెలకొని ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రెండు దేశాలతో మాట్లాడుతోందన్నారు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.
పుల్వామా దాడిలో చాలామంది చనిపోయారు. ఇకపై దీనికి ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నాం. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోవాలనుకుంటున్నాం.. అని ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రదాడిలో భారత్ చాలామందిని కోల్పోయిందని, తాము కూడా భారత్ పరిస్థితిని అర్థం చేసుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో గట్టిగా బదులివ్వాలని భారత్ అనుకుంటోందని ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య చాలా సమస్యలు ఉన్నాయని, అందులో భాగంగానే తాజా ఘటన అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.