గత రాత్రి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ బీజేపీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రే ఆమె పార్థివ దేహాన్ని జంతర్ మంతర్ లోని నివాసానికి తరలించారు. ఆమె పార్థివదేహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా, తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన కంటతడి పెట్టారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సుష్మాస్వరాజ్ యావత్ తెలంగాణకు చిన్నమ్మ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె అందించిన సహకారాన్ని రాష్ట్ర ప్రజలు మరవలేరని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఆమె తపించేవారని అన్నారు. తమలాంటి వారికి ఆమె స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.