ఆయుర్వేద వైద్య విద్యార్థుల ఆందోళన సందర్భంగా వారి పట్ల హైదరాబాద్ పోలీసులు అసభ్యకరంగా వ్యవహించారని కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి ఆరోపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఉందని అన్నారు. ఈ ఘటనను చూసిన తర్వాత మహిళలు, విద్యార్థుల విషయంలోనూ టీఆర్ఎస్ పాలకులకు ఎంత చులకన భావమో మరోసారి అర్థమవుతోందని దుయ్యబట్టారు.
విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖకు చెందిన మహిళా ఉద్యోగిపై టీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యే సోదరుడు ఆటవికంగా దాడి చేసినా, కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుందని విమర్శించారు. ఇప్పుడు ఆయుర్వేద కళాశాలకు చెందిన విద్యార్థి నులపై పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల యావత్ రాష్ట్రం అట్టుడికిపోతున్నప్పటికీ టీఆర్ఎస్ పాలకులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించడంలేదని ఘాటు విమర్శలు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు.