చంద్రబాబువి దుర్మార్గమైన ఆలోచనలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురంలోని కియా పరిశ్రమ యూనిట్లు పక్క రాష్ట్రానికి తరలిపోయాయంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పర్మినెంట్ సెటప్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ సంస్థ అయిన తరలి వెళ్లిపోతుందా? అని ప్రశ్నించారు.
రాజకీయ లబ్ధి పొందాలని, తనకు వత్తాసు పలికే మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదజల్లాలన్న ఆలోచనే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు బాబుకు పట్టడంలేదని దుమ్మెత్తిపోశారు. ఏపీ లో ఎవరూ పెట్టుబడులు పెట్టకూడదని, ఉద్యోగావకాశాలు ఉండకూడదన్న ఆలోచనలతో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు.