వైసీపీ కార్యకర్తల దాడులకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అండగా నిలుస్తుందని తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇచ్చారు.
కార్యకర్తలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. హత్యలను ప్రజలెవరూ అంగీకరించబోరని, తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటానని చెప్పారు. మనది ఒక్క గ్రామానికే పరిమితమైన పార్టీ కాదు, రాష్ట్రం అంతటా ఉంటుంది. మీరు ఆత్మస్థయిర్యంతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు.